హైదరాబాద్ : ప్రముఖ గాయని వాణీ జయరాం మృతి పట్ల రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. ఆమె వెయ్యి సినిమాలలో 20 వేల పాటలు పాడి వేలాదిమంది అభిమానులను పొందిన గొప్ప గాయని అని కొనియాడారు.వేలాదిగా భక్తి గీతాలు ఆలపించిన ఘనత ఆమె సొంతమని పేర్కొన్నారు.
సినీ పరిశ్రమ గొప్ప గాయని ని కోల్పోయిందని అన్నారు. ఆమె మృతి పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటని తెలిపారు.తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని నుంగమ్బక్కమ్లోగల హడ్డోస్ రోడ్డులో నివాసం ఉంటున్న ఆమె ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఇంట్లో జారిపడి ముఖంపై గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయిందని కుటుంబసభ్యులు తెలిపారు.
వాణీ జయరాం అసలు పేరు కలైవాణి. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్పురి ఇలా మొత్తం 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలను ఆమె ఆలపించారు.