హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖలో ఇటీవల కౌన్సెలింగ్ పూర్తి చేసుకొన్న 310 మంది ఫార్మసిస్టులకు సోమవారం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నియామక పత్రాలను అందజేయనున్నారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం రోజే ఈ కార్యక్రమం జరుగుతుండటం విశేషం. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) పరిధిలో 105 పోస్టులు, టీవీవీపీ పరిధిలో 135 పోస్టులు, డీఎంఈ పరిధిలో 70 పోస్టులు ఉన్నాయి. మొత్తం 310 పోస్టులకు ఈ నెల 21, 22 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు.
ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా 369 ఫార్మసిస్ట్ పోస్టులకు 2018 జనవరిలో నోటిఫికేషన్ జారీచేసింది. డీపీహెచ్ పరిధిలో 125, డీఎంఈ 96, టీవీవీపీలో 148 పోస్టులు ఉన్నాయి. కోర్టు కేసుల కారణంగా ఫలితాల వెల్లడి ఆలస్యమైంది. 310 పోస్టుల భర్తీకి న్యాయస్థానం అనుమతి ఇవ్వగా, మరో 59 పోస్టుల భర్తీని తాత్కాలికంగా వాయిదా వేసింది. ఈ మేరకు కౌన్సెలింగ్ పూర్తిచేసి నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు మంత్రి హరీశ్రావు అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో వైద్యారోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని చెప్పారు. 310 మంది ఫార్మసిస్టుల చేరికతో వైద్యారోగ్య శాఖ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు వైద్యారోగ్య రంగంలో జరిగిన మార్పును మంత్రి హరీశ్రావు ఇదే వేదికగా ప్రజలకు వివరించనున్నారు. పదేండ్ల ప్రస్థానాన్ని వివరించేలా వైద్యారోగ్య శాఖ ప్రగతి నివేదికను సిద్ధం చేసింది. 2014 నాటికి రాష్ట్ర వైద్యారోగ్య రంగంలోని పరిస్థితులు, స్వరాష్ట్రంలో మార్పులు, సదుపాయాలను వివరించనున్నారు. పీహెచ్సీల నుంచి సూపర్ స్పెషాలిటీ దవాఖానల వరకు ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కేసీఆర్ కిట్, అమ్మఒడి, ఉచిత డయాలసిస్ వంటి పథకాల ఫలితాలు, సీఎం మార్గనిర్దేశనంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రక్రియ వంటి అంశాల నివేదికను ప్రజల ముందు ఉంచనున్నట్టు అధికారులు తెలిపారు .