మణికొండ, అక్టోబర్ 2: సమాజంలో అందరూ సమానమేనని, మానవత్వం, ఆదర్శప్రాయమైన జీవనంలోనే సంతృప్తి ఉన్నదని చాటిచెప్పిన మహనీయుడు బసవేశ్వరుడని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో నిర్మించనున్న బసవేశ్వర ఆత్మగౌరవ భవన నిర్మాణానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాసగౌడ్తో కలిసి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. జాతిపిత గాంధీ, బసవేశ్వరుడికి అనేక పోలికలు ఉన్నాయని ఉదహరించారు.
విద్య, సమాజం, సమానత్వం కోసం పోరాటం చేసిన మహనీయుడు బసవేశ్వరుడని, అదే విధానాన్ని గాంధీజీ అనుసరించారని వివరించారు. బసవేశ్వరుడి గొప్పతనాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం బసవేశ్వర జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ విన్నవించిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ ట్యాంక్బండ్పై విగ్రహాన్ని ఏర్పాటుచేశారని తెలిపారు. పాఠ్యాంశంలో కూడా బసవేశ్వర జీవిత చరిత్రను చేర్పించిన ఘనత తెలంగాణ సర్కారుదేనని చెప్పారు. లింగాయత్ సమాజానికి టీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా అనేక అవకాశాలను కల్పించిందన్నారు. బీబీ పాటిల్ ఎంపీగా, శివకుమార్ డీసీఎంఎస్ చైర్మన్గా, అనేకమంది మున్సిపల్ చైర్మన్లుగా, జడ్పీ చైర్మన్లుగా ఎదిగేందుకు అవకాశం కల్పించామని గుర్తుచేశారు. కోకాపేటలో రూ.వంద కోట్ల విలువైన భూమిని సీఎం కేసీఆర్ లింగాయత్ బసవేశ్వర కులానికి కేటాయించి, నిర్మాణం కోసం రూ.పది కోట్ల నిధులను మంజూరు చేశారని తెలిపారు.
లింగాయత్ సమాజాన్ని ఓబీసీలో చేర్చాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయాన్ని మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. ఓబీసీ రిజర్వేషన్ల అమలుపై కేంద్రాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. తమది మాటల ప్రభుత్వం కాదని ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించే ప్రభుత్వమని చెప్పారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బసవేశ్వరుడిని ఆదర్శంగా తీసుకొని కుల, మతాలకు అతీతంగా ఉండాలని సూచించారు. పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు.