జీ 20 సదస్సులో సందర్భం లేకపోయినా రాష్ట్ర వ్యవహా రాలను గవర్నర్ ప్రస్తావించారు. నాలుగున్నర కోట్లమంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దారుణంగా అవమానపర్చారు.
– మంత్రి హరీశ్రావు
Minister Harish rao | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ప్రపంచం ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని గవర్నర్ కించపరుస్తారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. జీ 20 సదస్సుల్లో రాష్ట్ర ప్రతిష్ఠను పెంచాల్సింది పోయి కించపరిచారని మండిపడ్డారు. ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ హైదరాబాద్ను న్యూ యార్క్తో పోల్చి కీర్తిస్తే.. గవర్నర్ మాత్రం హైదరాబాద్ గడ్డ మీద ప్రపంచ దేశాల సదస్సులో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీశారని ఆరోపించారు.
మా ఇంటికి మీ ఇల్లు ఎంతదూరమో.. మీ ఇల్లూ మా ఇంటికి అంతే దూరమని, గౌరవం ఇచ్చిపుచ్చుకొనే ప్రాతిపదికన ఉంటుందని స్పష్టంచేశారు. జీహెచ్ఎంసీ మేయర్ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వని గవర్నర్.. బీజేపీ నేతలకు మాత్రం రాజ్భవన్ దర్వాజాలు బార్లా తెరిచారని మండిపడ్డారు. గురువారం బీఆర్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా (చిట్చాట్) మాట్లాడారు. తమిళిసై గవర్నర్లా కాకుండా ప్రతిపక్ష పార్టీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్కు రాజకీయాలు ఇష్టముంటే మళ్లీ బీజేపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయొచ్చని సూచించారు. రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గవర్నర్ చెప్తున్నారని, ప్రధాని మోదీ పార్లమెంట్ నూతన భవన నిర్మాణ శంకుస్థాపనకు రాష్ట్రపతిని ఆహ్వానించారా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కితేకానీ రాజ్భవన్లో ఫైల్ కదలటం లేదని అన్నారు.
పార్లమెంట్ నూతన భవన భూమిపూజకు రాష్ట్రపతిని ఆహ్వానించారా? అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును విశాఖపట్నం, ముంబై, కొచ్చి.. ఇలా అనేకసార్లు ప్రారంభించిన మోదీ, ఒక్కసారైనా రాష్ట్రపతిని పిలిచారా? అని నిలదీశారు. పిలవడం, పిలవకపోవడం మోదీ ఇష్టమని, అలాగే సచివాలయ ప్రారంభానికి గవర్నర్ను పిలవలా.. వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టంచేశారు. తనను ప్రధాని ఏ కార్యక్రమాలకూ ఆహ్వానించటం లేదని రాష్ట్రపతి అడుగుతున్నారా? అని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ మొదటి సమావేశాలకు గవర్నర్ను పిలవాలని, మంత్రివర్గ సభ్యుల ప్రమాణస్వీకారం, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పదవీ ప్రమాణం చేయించటం, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా జనవరి 26న జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ఆహ్వానిస్తారని తెలిపారు. ఇవి కాకుండా గవర్నర్ను ప్రతీ కార్యక్రమానికీ పిలవాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. ఎవరితో ఏ కార్యక్రమం నిర్వహించుకోవాలనేది ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.
ఒక మహిళగా, రాష్ట్ర గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ను తాము తప్పకుండా గౌరవిస్తామని మంత్రి హరీశ్రావు అన్నారు. కానీ, రాష్ట్ర ప్రయోజనాలకు గవర్నర్ తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర మంత్రివర్గం, అసెంబ్లీ రూపొందించిన బిల్లులను గవర్నర్ నెలల తరబడి పెండింగ్లో పెట్టడం ఏ రకమైన నీతి? అని ప్రశ్నించారు. గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా.. లేవా? సదరు బిల్లు ఉమ్మడి జాబితాలో ఉన్నదా? రాష్ట్ర జాబితాలోని 61 అంశాలకు సంబంధించినదా.. కాదా? ఆ బిల్లు సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా ఉన్నదా.. లేదా? రాష్ట్రం తన పరిధిని దాటి బిల్లులను రూపొందించిందా? అన్న విషయాలను చూడాల్సిన బాధ్యత మాత్రమే గవర్నర్పై ఉన్నదని వివరించారు.
ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఉత్తరం రాశారని గ్రామ పంచాయతీ బిల్లును గవర్నర్ వాపస్ చేశారని మంత్రి హరీశ్రావు తెలిపారు. మంత్రివర్గంలో చర్చించి ఆమోదించి, అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించి ఆమోదించిన విషయం ముఖ్యమా? ఒక ఎమ్మెల్యే ఇచ్చిన ఉత్తరం ముఖ్యమా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే లేఖ ఆధారంగా బిల్లును వాపస్ పంపటం చరిత్రలో ఎక్కడైనా ఉన్నదా? అని నిలదీశారు. ఒక ఎమ్మెల్యే లేఖకు ఉన్న విలువ, యావత్తు అసెంబ్లీ నిర్ణయానికి లేదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా బిల్లులు ఉన్నా, సదరు బిల్లు కేంద్ర పరిధిలోనిదని, లేదా సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉన్నదని వెనక్కి పంపితే అర్థం ఉంటది కానీ.. ఇవేవీ లేకుండా గవర్నర్ వ్యవహరించటం అన్యాయమని ఆవేదన వ్యక్తంచేశారు.
వైద్యవిద్యకు సంబంధించిన మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్లు దొరకడంలేదని, అనుభవం ఉన్న ప్రొఫెసర్ల సేవలను వినియోగించుకొనేందుకు వయోపరిమితిని 65 ఏండ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని హరీశ్రావు చెప్పారు. అయితే సాంకేతికంగా బిల్లులో అదనపు డీఎంఈ, డీఎంఈ, ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ వంటి పదాలు లేవని తెలిపారు. ఆ పోస్టులకు ప్రొఫెసర్లే అర్హులనే విషయానికి అనుగుణంగా బిల్లులో సవరణ చేసి పంపితే గవర్నర్ ఆమోదించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఎన్ఎంసీ (నేషనల్ మెడకల్ కౌన్సిల్) 2022లో వైద్య కళాశాలల్లో అధ్యాపకుల నియామకం, వయో పరిమితికి సంబంధించి సవరణ చేసిందని, దాని ప్రకారం 70 ఏండ్ల వయస్సున్న వారిని కూడా నియమించుకోవచ్చని ఉదహరించారు. ప్రొఫెసర్ల గరిష్ఠ వయోపరిమితి పశ్చిమబెంగాల్లో 70 ఎండ్లు, అస్సాంలో 67 ఏండ్లు, అనేక రాష్ర్టాల్లో 65 ఏండ్లు ఉన్నదని గుర్తుచేశారు. కేంద్రం ఆధీనంలో నడిచే సఫ్దర్జంగ్ మెడికల్ కాలేజీ, పాండిచ్చేరి జిప్మర్ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ల వయోపరిమితి 65 ఏండ్లేనని ఉదహరించారు.
కేసీఆర్ కేవలం ముఖ్యమత్రి కాదని, నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ప్రతినిధి అని మంత్రి హరీశ్రావు అన్నారు. అటువంటి నాయకుడి పట్ల గవర్నర్ వ్యవహరించిన తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన గొప్ప నాయకుడు, ఓటమి ఎరుగని దార్శనికుడు సీఎం కేసీఆర్ అని.. అటువంటి వ్యక్తిపై లేనిపోని ఆభాండాలు వేయవచ్చునా? అని ప్రశ్నించారు. సిద్దిపేట, కరీంనగర్, మహబూబ్నగర్, గజ్వేల్ ఇలా ఎక్కడ పోటీచేసినా గెలిచిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని, కేసీఆర్ అంటే క్రేజ్ ఉన్న నేత అని అభివర్ణించారు. దేశ చరిత్రలో రాజీనామా చేసిన ప్రతీసారి గెలిచిన నేత ఒక్క కేసీఆరేనని చెప్పారు. డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే, కేంద్రమంతి, ఎంపీ ఇలా అన్ని పదవులను త్యాగం చేసిన వ్యక్తి కేసీఆర్ కాకుండా ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవాళ్లు రాజకీయ నేతలుగా వ్యవహరించటం బాధాకరమని అన్నారు.
ఒక బిల్లును చదివి నిర్ణయం తీసుకోవటానికి 7 నెలల సమయం పడుతుందా? అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో ఉదయం 11 గంటలకు కేసు విచారణకు వస్తే రాత్రి 11 గంటలకు ఫలానా బిల్లు తిరస్కరిస్తున్నానని, ఫలానా బిల్లు రాష్ట్రపతికి నివేదిస్తున్నానని, మరో బిల్లుపై కొర్రీలు వేసి ప్రభుత్వానికి పంపటం ఎక్కడైనా ఉన్నదా? సుప్రీం కోర్టు మెట్లు ఎక్కితేగాని ఫైల్ కదలదా? అని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్న క్రమంలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తే అర్హత, అనుభవం గల ప్రొఫెసర్లు దొరకటం లేదని, వీరి కొరత తీవ్రంగా ఉన్నదని మంత్రి హరీశ్రావు తెలిపారు. వయోపరిమితిని 65 ఏండ్లకు పెంచటంద్వారా అనుభవం గల ప్రొఫెసర్లను వినియోగించుకొనే వెసులుబాటు దొరుకుతుందని భావించి ఆ మేరకు బిల్లును రూపొందించి గవర్నర్కు పంపితే ఆమోదించకపోవడం బాధాకరమని అన్నారు. 61 ఏండ్ల ప్రిన్సిపాల్.. 65 ఏండ్ల ప్రొఫెసర్ను అజమాయిషీ చేయగలరా? ప్రొఫెసర్కన్నా జూనియర్లు ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్, డీఎంఈ, అడిషనల్ డీఎంఈగా ఉండొచ్చా? అని ప్రశ్నించారు.
నాణ్యమైన విద్య అందించాలంటే అనుభవం ఉన్న ప్రొఫెసర్లు కావాలనే ఉద్దేశంతో బిల్లు పెడితే దాన్ని గవర్నర్ 7 నెలలు ఆపొచ్చా? అని నిలదీశారు. స్వతహాగా డాక్టర్ అయిన గవర్నర్ ఇటువంటి బిల్లును ఆపటం న్యాయమా? అని ప్రశ్నించారు. 7 నెలలు బిల్లును ఆపటంవల్ల రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమైనదా? అని ప్రశ్నించారు. గవర్నర్ను తాము గౌరవిస్తామని, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, వైద్యారోగ్య శాఖల కార్యదర్శులు గవర్నర్ను కలిసిన విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో వైద్యవిద్య విస్తృతి ద్వారా పేదలకు వైద్యం, పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే ప్రభుత్వ సంకల్పానికి గవర్నర్ గండికొడుతున్నారని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఇది పేదలకు వైద్యాన్ని, పిల్లలకు వైద్య విద్యను దూరం చేయటమేనని ‘నా ప్రభుత్వం.. నా ప్రభుత్వం అంటూనే ప్రభుత్వాన్ని వెన్నుపోటు పొడుస్తున్నారు అని ధ్వజమెత్తారు. గవర్నర్ తీరు ‘నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు’ ఉన్నదని మండిపడ్డారు.
యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును గవర్నర్ అపటం వెనుక తెలంగాణ నిరుద్యోగ యువతకు, నాణ్యమైన విద్యను కోరుకొనే విద్యార్థులకు తీరని నష్టం కలిగించే ప్రయత్నం ఉన్నదని హరీశ్రావు ఆరోపించారు. ఈ బిల్లును కూడా గవర్నర్ 7 నెలలు పెండింగ్లో పెట్టారు.. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. వర్సిటీల్లో ఉద్యోగ నియామకాలు జరిపితే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేవని, శాశ్వత ప్రాతిపదికన ప్రొఫెసర్లు వస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని అన్నారు. 1960 నుంచి బీహార్లో, 22 ఏండ్లుగా జార్ఖండ్లో, ఒడిశాలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కామన్ రిక్రూట్మెంట్ బోర్డులు ఉన్నాయని గుర్తుచేశారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు రాజ్యాంగ విరుద్ధమే అయితే ఆ రాష్ర్టాల్లోని యూనివర్సిటీల్లో ఎందుకు అనుమతిచ్చారని ప్రశ్నించారు. ఈ బిల్లును ఆపటం ద్వారా రాష్ట్ర తొలి పౌరురాలిగా గవర్నర్ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షిస్తున్నట్టా? మంటగలుపుతున్నట్టా? అని నిలదీశారు.
రాష్ట్రంలో 5 ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును గతంలో ఆమోదించిన ఇదే గవర్నర్.. ఇప్పుడు 7 యూనివర్సిటీలను ఆపటం వెనుక ఆంతర్యం ఏమిటని హరీశ్రావు ప్రశ్నించారు. కర్ణాటక, మహారాష్ట్ర వంటి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అత్యధిక ప్రైవేటు యూనివర్సిటీలున్నాయని ఉదహరించారు. సిద్దిపేటలో వెటర్నరీ కాలేజీ ఏర్పాటుకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి వచ్చినా ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ ఆగిపోవటం ఇబ్బందిగా మారిందని పీవీ నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీ వీసీ పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇటువంటి చర్యలతో గవర్నర్ పరోక్షంగా రాష్ట్ర ప్రగతిని అడ్డుకొంటున్నారని ఆరోపించారు.
గవర్నర్ బీజేపీ కనుసన్నల్లో ఆ పార్టీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్టు తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. గవర్నర్ పదవి, స్థాయి మీద తాము సంయమనం పాటిస్తున్నాము తప్ప విమర్శించలేక కాదని స్పష్టంచేశారు. ప్రభుత్వం సంయమనంతో ఉన్నా గవర్నరే అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఐటీ, వ్యాక్సిన్, ఫార్మా, మెడికల్ టూరిజంలో లీడర్గా ఉన్న హైదరాబాద్పై గవర్నర్ జీ 20 సమ్మిట్లో అవమానకరంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలను ఒక్క బటన్ నొక్కి ప్రారంభించారని, అదే ఒక్క ఎయిమ్స్కు భూమి పూజ చేయటానికి ఢిల్లీ నుంచి కేంద్రం పెద్దలు వచ్చి నానా హంగామా చేశారని హరీశ్రావు ఎద్దేవా చేశారు. ప్రజలకు వైద్యం అందిందా? లేదా పిల్లలకు సీట్లు వచ్చాయా? లేదా అన్నది తమకు ముఖ్యం అని చెప్పారు. కేవలం రెండేండ్లలోనే ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి, తరగతులు ప్రారంభించుకోవటం చరిత్ర అన్నారు. అది సీఎం కేసీఆర్తోనే సాధ్యమని పేర్కొన్నారు. ఐదేండ్ల కింద వచ్చిన ఎయిమ్స్కు కొబ్బరికాయ కొట్టి మస్తు డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.