హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రభుత్వాలు పూర్తికాలం కొనసాగటం ప్రధాని మోదీకి ఇష్టంలేదని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీడియాతో మాట్లాడుతూ.. దేశం సర్వనాశనం కావాలని బీజేపీ కోరుకొంటున్నదని.. ఇలాంటి పరిణామాలు ఎంతమాత్రం మంచిది కాదని పేర్కొన్నారు.
మోదీ, అమిత్షాలు ప్రజాస్వామ్య వ్యవస్థలను ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మధ్యప్రదేశ్లో చేసిన విధంగానే మహారాష్ట్రలో కూడా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరుగుతున్నదన్నారు. ఈ కుట్రలో భాగంగానే ఎమ్మెల్యేలను ఒక చోటునుంచి మరో చోటుకు తరలిస్తున్నదని పేర్కొన్నారు. అధికారమనేది జీవితకాలం కొనసాగదన్న వాస్తవాన్ని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవని.. మహారాష్ట్రలో ఇవాళ సృష్టించిన సంక్షోభాన్ని భవిష్యత్తులో బీజేపీకీ ఎదురవుతుందని హెచ్చరించారు. బీజేపీ జాతీయ సమావేశాలకు వచ్చే బీజేపీ ముఖ్యమంత్రులకు, నేతలకు ఇక్కడి అందాలు, జరుగుతున్న ప్రగతిని చూసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా యువత ఆందోళనకు దిగితే బీజేపీ నేతలు ఇష్టమొచ్చిన విధంగా మాట్లాడటం సమంజసమేనా? అని మంత్రి తలసాని ప్రశ్నించారు.