రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో అర్హులైన లబ్దిదారులందరూ పదిరోజుల్లో తమ వాటాధనం డీడీలు చెల్లించే విధంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. మసాబ్ ట్యాంక్లోని మత్స్య శాఖ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల పశువైద్యాధికారులు, వెటర్నరీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంతో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని, ఇది అందరి కృషితోనే సాధ్యమైందన్నారు. గొర్రెల ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పశుసంవర్ధక శాఖ కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, సబ్సిడీ పై గొర్రెలు, పాడి గేదెల పంపిణీ, జీవాలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడం వల్ల ఎంతో ప్రాధాన్యత కలిగిన శాఖగా పశుసంవర్ధక శాఖకు గుర్తింపు లభించిందని తెలిపారు.
దేశంలోనే తెలంగాణ పశుసంవర్ధక శాఖకు మంచి పేరు లభించిందని మంత్రి తలసాని పేర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున జీవాలు వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, జీవాల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే, అన్ని పశువైద్యశాలల్లో జీవాలకు అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఒకవేళ మందుల కొరత ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. మందుల కొరత ఉన్నట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని మంత్రి అధికారులను హెచ్చరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలతో మరణించిన జీవాల సమాచారాన్ని బాధితుల నుంచి సేకరించి ఆయా జిల్లా కలెక్టర్లు, పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులకు నివేదికను అందజేయాలన్నారు. అలాగే, విపత్తుల నివారణ సంస్థ ద్వారా ప్రభుత్వం అందజేసే ఆర్థికసహాయాన్ని త్వరితగతిన బాధితులకు అందేలా కృషి చేయాలని ఆదేశించారు.
సబ్సిడీపై పంపిణీ చేసిన గొర్రెలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించిందని, చనిపోయిన గొర్రెలకు వెంట వెంటనే క్లైయిమ్ కింద గొర్రెను కొనుగోలు చేసి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని ఆదేశించారు. వర్షాకాలంలో పశువులు, గొర్రెలు, మేకలు గుండెవాపు, జబ్బవాపు, చిటుకు, నీలి నాలుకలాంటి రోగాల బారిన పడకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కొన్ని జిల్లాల్లో మాత్రమే 90 శాతం వరకు పూర్తయిందని, మిగిలిన జిల్లాల్లో కూడా వారంలోగా వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ శాఖల కు చెందిన ఖాళీ స్థలాల్లో పశుగ్రాసం పెంపకం, క్యాటిల్ హాస్టళ్ల ఏర్పాటు, వ్యాక్సినేషన్ కార్యక్రమాలలాంటివి చేపట్టాలని మంత్రి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. పలు ప్రాంతాలలో నూతన పశువైద్యశాలల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని, దీనికి సంబంధించి ప్రతిపాదనలను అందజేయాలని ఆదేశించారు. శిథిలావస్థకు చేరుకున్న పశువైద్య శాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
గొర్రెలు, మేకల క్రయవిక్రయాలకు మార్కెట్లు
గొర్రెలు, మేకలు క్రయ విక్రయాలు జరుపుకొనేందుకుగానూ అన్ని జిల్లాల్లో అన్ని వసతులతో కూడిన మార్కెట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు అవసరమైన 5 ఎకరాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ల సహకారంతో సేకరించాలని మంత్రి తలసాని ఆదేశించారు. ఇప్పటికే కామారెడ్డి, వనపర్తి, ఖమ్మం, కరీంనగర్ తదితర జిల్లాలలో మార్కెట్ల నిర్మాణం కోసం స్థల సేకరణ, నిధుల మంజూరు కూడా జరిగిందని చెప్పారు. కామారెడ్డి లో నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయని వివరించారు. మార్కెట్ల నిర్మాణం కోసం అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, మిగిలిన జిల్లాల్లో కూడా వీలైనంత త్వరగా స్థల సేకరణ పూర్తిచేయాలని చెప్పారు. ప్రభుత్వం పాడి రైతులకు అన్ని విధాలుగా చేయూతను అందిస్తున్నప్పటికీ విజయ డెయిరీకి పాల సేకరణ పెరగడం లేదన్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. లీటర్ పాలకు 4 రూపాయల నగదు ప్రోత్సాహకం, సబ్సిడీ పై పాడి గేదెల పంపిణీ, సబ్సిడీపై పశు దాణా, మందుల పంపిణీలాంటివి అందిస్తున్నందున వీటిని పాడి రైతులకు వివరించి విజయ డెయిరీకి పాలు పోసే విధంగా అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించాలని పశుసంవర్ధక శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు పూర్తిస్థాయిలో అమలు జరిగేందుకు అధికారులు వారంలో మూడు రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించాలని మంత్రి తలసాని ఆదేశించారు. దీంతో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది పనితీరు మరింత మెరుగవుతుందని, రైతుల సమస్యలు కూడా తెలుసుకొనే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో గోపాలమిత్రల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. పశుసంవర్ధక, టీఎస్ఎల్డీఏ, డెయిరీ అధికారులు ఉమ్మడి ప్రణాళికతో పనిచేయడం ద్వారా మరెన్నో అద్బుతమైన ఫలితాలను సాధించవచ్చని, కార్యాచరణను రూపొందించుకోవాలని చెప్పారు. కృత్రిమ గర్భధారణలో కూడా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా టెస్ట్ ట్యూబ్ బేబి తరహాలో(ఐవీఎఫ్) రెండు మగ, ఒక ఆడ దూడలను ఉత్పత్తి చేయడం ఒక గొప్ప విజయంగా మంత్రి అభివర్ణించారు. కోరుట్లలోని వెటర్నరీ కళాశాల ఆధ్వర్యంలో ఐఈవీఎఫ్ విధానంలో ఆరోగ్యవంతమైన, అధిక పాల ఉత్పత్తిని సాధించే లక్ష్యంతో చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ విధానంతో కలిగే ప్రయోజనాల గురించి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేలా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో షీఫ్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, డైరెక్టర్ రాంచందర్, టీ ఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి, తదితరులు పాల్గొన్నారు.