హైదరాబాద్: ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా (Asthama) వ్యాధిగ్రస్తులకు అందించే చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ప్రారంభించారు. హైరదాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో (Nampally Exhibition ground) ఉబ్బసం, ఆయాసం వంటి వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబ సభ్యులు (Battini family) చేప మందును ఉచితంగా పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తున్నది. కరోనా నేపథ్యంలో మూడేండ్ల విరామం తర్వాత శుక్రవారం ఉదయం చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. రెండు రోజులపాటు చేప మందును అందించనున్న నేపథ్యంలో ప్రభుత్వం పకడ్భందీగా ఏర్పాట్లు చేసింది. తెలంగాణ మత్స్యశాఖ ఆధ్వర్యంలో 1.5 లక్షల కొర్రమీను చేపలను అందుబాటులో ఉంచారు. అదనంగా మరో 75 వేల చేప పిల్లలతోపాటు.. అవసరమైతే మన్ని చేప పిల్లలను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
చేప మందుకోసం గురువారం నుంచే దేశం నలుమూలల నుంచి ప్రజలు నగరానికి తరలివస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వంటి అనేక ప్రాంతాల నుంచి వ్యాధిగ్రస్తులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. మొత్తం 32 క్యూలైన్ల ద్వారా ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. నాంపల్లి గ్రౌండ్ పరిసరాల్లో 700 వరకు సీసీ కెమెరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండు రోజులపాటు దాదాపు 300 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. 10వ తేదీవరకు నగరంలోని సికింద్రాబాద్ స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్టు వంటి ప్రాంతాల నుంచి దాదాపు 50 బస్సులను ఏర్పాటు చేశారు. అలాగే మరో 14 ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు 80 బస్సులను నడుపుతున్నారు.