హైదరాబాద్: మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చేపల మార్కెటింగ్, చేపల వంటకాల తయారీపై నిర్వహించే శిక్షణను మహిళా మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్లోని నిథమ్ ఇన్స్టిట్యూట్లో మహిళా మత్స్యకారుల శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. జూన్ 7 నుంచి 9 వరకు అన్ని జిల్లాల్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని చెప్పారు. మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారని తెలిపారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మత్స్య సంపద మూడింతలు పెరిగిందని వెల్లడించారు. పెరిగిన సంపదను మత్స్యకారులకే అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొత్తగా 1.30 లక్షల మంది మత్స్యకారులకు సభ్యత్వం కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని తెలిపారు. రానున్న రోజుల్లో దేశ విదేశాలకు చేపలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటామని స్పష్టం చేశారు.