హైదరాబాద్: మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పెద్దఎత్తున తరలి వెళ్తున్నారు. నగరం నుంచి మునుగోడుకు వెళ్తున్న భారీ కాన్వాయ్కి నెక్లెస్ రోడ్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. మునుగోడులో విజయం టీఆర్ఎస్ పార్టీదేనని స్పష్టం చేశారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చేతకాని తనం వల్లే ఉప ఎన్నిక వచ్చిందని విమర్శించారు.
కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ను టీఆర్ఎస్లో చేరాలని ఆహ్వానించానని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలంటే సీనియర్లంతా టీఆర్ఎస్లో చేరాలని పిలుపునిచ్చారు.
ఖైరతాబాద్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల నుంచి మూడు వందల చొప్పున కార్లలో టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు మునుగోడుకు బయల్దేరారు. మొత్తంగా ఐదు వేలకుపైగా కార్లతో హైదరాబాద్ నుంచి మునుగోడుకు భారీ ర్యాలీ జరుగనుంది.