హైదరాబాద్: కార్మికులే దేశానికి వెన్నెముక అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కార్మికులు లేకపోతే ప్రపంచమే లేదని చెప్పారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. కార్మిక శాఖ మంత్రిగా మల్లారెడ్డే సరైనవారని సీఎం కేసీఆర్ నియమించారని తెలిపారు.
గత రెండెండ్లుగా కరోనా వల్ల శ్రమశక్తి అవార్డు ప్రదానోత్సవం చేయలేకపోయామన్నారు. కార్మికులను ఆర్థికంగా, సామాజికంగా పైకి తేవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని వెల్లడించారు.
కరోనాతో కార్మికులకు పనిలేకుండా పోయిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చాలా పరిశ్రమలు కరోనా, కరెంట్ కోతలతో కార్మికులను తీసేశాయని చెప్పారు. కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వెల్లడించారు. వివిధ రాష్ట్రాలకు చెందినవారు పనికోసం హైదరాబాద్ వస్తారని, హైదరాబాద్ అందరినీ ఆదరిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.