Minister Srinivas Yadav | మన సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు, బతుకమ్మ వేడుకలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని, ఇది మనకెంతో గర్వకారణమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్లోని జగ్దీశ్ ఆలయం వద్ద కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు మంత్రి పూజలు నిర్వహించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్ర పండుగగా ప్రకటించారని, ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుకుంటున్న బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని కోరుతూ వస్తున్నప్పటికీ గత పాలకులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ నెల 22న గోల్కొండలో బోనాలు ప్రారంభం అయ్యాయని, జులై 9న సికింద్రాబాద్ బోనాలు, 16న ఓల్డ్ సిటీ బోనాలు జరుగుతాయని వివరించారు. బోనాల ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కోరారు.
దేవాలయాలకు ఆర్థిక సహాయం అందించేందుకు రూ.15 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. దేశంలో ఒక్క తెలంగాణలో మాత్రమే దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాలకు సైతం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ప్రభుత్వం సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ వాటి పరిరక్షణకు కృషి చేస్తుందని తెలిపారు. ప్రజలు సంతోషంగా ఉండాలి, పండుగలను గొప్పగా జరుపుకోవాలి అనేది ముఖ్యమంత్రి ఆలోచన అని చెప్పారు. కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, పలువురు కుమ్మరి సంఘం నాయకులు పాల్గొన్నారు.