Balkampet Yellamma Kalyanam | ఎంతో విశిష్టత కలిగిన బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ వేడుకలను అంగరంగ వైభవం నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎంసీహెచ్ఆర్డీలో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ ఏర్పాట్లపై మంత్రి అధ్యక్షతన అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూన్ 19న ఎదుర్కోలు ఉత్సవం, 20న అమ్మవారి కల్యాణం, 21న రథోత్సవం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు నగరంతో పాటు రాష్ట్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారన్నారు.
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం అమ్మవారి కల్యాణం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తూ ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం అమ్మవారి కల్యాణానికి 8 లక్షల మంది వరకు భక్తులు వచ్చారని, ఈ సంవత్సరం 15 లక్షల వరకు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. కల్యాణాన్ని అందరూ వీక్షించే విధంగా ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయం వద్ద ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
కల్యాణోత్సవ వేడుకలకు ముందే ఆలయ పరిసరాల్లో అవసరమైన మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. ఆలయానికి వచ్చే అన్ని రహదారులను ఎంతో అద్భుతంగా నిర్మించినట్లు తెలిపారు. గతంలో అమ్మవారి కల్యాణాన్ని కొద్దిమంది భక్తుల సమక్షంలో నిర్వహించే వారని, ప్రస్తుతం ఆలయం ఎదుట నిర్మించిన భారీ షెడ్డు కింద లక్షలాది మంది సమక్షంలో నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. అమ్మవారి కల్యాణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన వెండితో ఆలయ ప్రధాన ద్వారం తలుపులకు వెండి తాపడం చేసే పనులను కల్యాణం నాటికి పూర్తిచేయడం జరుగుతుందని చెప్పారు.
కల్యాణం నిర్వహణ ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వచ్చే లక్షలాది మంది భక్తులు దర్శనం సమయంలో ఇబ్బందులులేకుండా బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వివిధ శాఖల మద్య సమన్వయంతో పని చేసే విధంగా ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా పారిశుధ్య నిర్వహణ కోసం అదనపు సిబ్బందిని నియమించి పర్యవేక్షించాలని ఆదేశించారు. క్యూ లైన్లో భక్తుల కోసం వాటర్ ప్యాకెట్లు, బాటిల్స్ అందుబాటులో ఉంచాలని వాటర్ వర్క్స్ అధికారులకు సూచించారు. తాగునీటిని అందించేందుకు సిబ్బందిని నియమించాలని చెప్పారు. కల్యాణోత్సవం సందర్భంగా భక్తులకు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అన్నదానం చేస్తారని, వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పారు.
రథోత్సవం రోజున 500 మంది కళాకారులతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఆలయ పరిసరాల్లో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నాలుగు క్యాంప్లతో పాటు నాలుగు నాలుగు అంబులెన్స్లను అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ప్రశాంత వాతావరణంలో అమ్మవారి కల్యాణం నిర్వహించే విధంగా ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలకు అదనంగా తాత్కాలికంగా మరిన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, వలంటీర్లకు ప్రత్యేక ఐడెంటిటీ కార్డులను అందజేయాలని పోలీసు, దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు.
కల్యాణం, రథోత్సవం జరిగే రెండు రోజుల పాటు ఆలయం వైపు వాహనాలు రాకుండా ట్రాఫిక్ను మళ్లించాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, జనరేటర్లు, అదనపు ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను మంత్రి ఆదేశించారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, వాటర్ వర్క్స్ డైరెక్టర్ కృష్ణ, వైద్యా ఆరోగ్యశాఖ జిల్లా అధికారి వెంకట్, ఐఅండ్పీఆర్ జేడీ జగన్, అగ్నిమాపక శాఖ అధికారి మధుసూదన్ రావు, దేవాదాయ శాఖ రీజనల్ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.