హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణపై చర్చకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, వీ శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. రాష్ర్టాభివృద్ధికి కేంద్రం సహకరించకపోయినా సీఎం కేసీఆర్ దార్శనికతతో అన్ని రంగాల్లో నంబర్వన్గా నిలుస్తున్నదని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులే నిదర్శనమని చెప్పారు. అవినీతి రహిత పాలనకు తెలంగాణ దిక్సూచి అని ఇటీవల ఓ సర్వే ప్రకటిస్తే.. ప్రధాని మోదీ రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుందని పేర్కొనటం శోచనీయమన్నారు. శనివారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం లో ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశంతో కలిసి మంత్రులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. అధికారిక కార్యక్రమాన్ని సైతం రాజకీయ వేదికగా చేసుకోవడం మోదీకే చెల్లిందని విమర్శించారు. తెలంగాణ పట్ల మొదటి నుంచి మోదీ గుడ్డి వ్యతిరేకతతో ఉన్నారని, తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని, రాష్ట్ర ఏర్పాటు అప్రజస్వామికంగా జరిగిందని మోదీ అనేకసార్లు పేర్కొనటమే నిదర్శమని గుర్తుచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి సహకరించటం లేదని మోదీ పేర్కొనటాన్ని తప్పుబట్టారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ ఏమిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాల్లో భారత ప్రతిష్ఠను దిగజార్చేవిధంగా చేసిన మోదీకి అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కులేదని చురకలంటించారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ సహా ప్రతిపక్ష పార్టీలన్ని అదానీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి నిజానిజాలు నిగ్గుతేల్చాలని డిమాండ్ చేసినా కేంద్రం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తెలంగాణ వెనుకబడితే కేంద్రం అవార్డులు ఎందుకు ఇస్తున్నదని అడిగారు. తలసరి ఆదాయం, జీఎస్డీపీలో దేశంలో తెలంగాణ ఎందుకు నంబర్ 1గా ఉందో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రొటోకాల్పై తమకెవరూ చెప్పాల్సిన అవసరం లేదని, ప్రధాని హోదాలో మోదీ ప్రొటోకాల్ పాటించలేదని విమర్శించారు. గతంలో ప్రధానికి స్వాగతం చెప్పేందుకు సీఎం కేసీఆర్ బయలుదేరితే.. ‘నాతో ఎవరూ రావద్దూ.. నేనొక్కడినే వెళతా’ అని చెప్పింది మోదీయేనని గుర్తుచేశారు.
అవినీతి ఉంటే అవార్డులెట్ల వస్తయి?: మంత్రి శ్రీనివాస్గౌడ్
రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోతే కేంద్రం ప్రకటించే అవార్డులు తెలంగాణకే ఎందుకు వస్తున్నాయని మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ర్టాలు తెలంగాణ కంటే ఏ రంగంలో ముందున్నాయో? ప్రధాని మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘తెలంగాణ అభివృద్ధి చెందాలన్న తపన తప్ప కేసీఆర్కు మరోటి లేదు’ అని మిషన్ భగీరథ ప్రారంభంలో మోదీ చెప్పిన మాటలను గుర్తుచేశారు. తెలంగాణ మీదుగా ఇతర రాష్ర్టాలకు రోడ్లు వేయాల్సిన అనివార్యత నెలకొనటం వల్ల వేశారని, గాల్లో రోడ్లు వేసే అవకాశం ఉంటే కక్షగట్టి వేయకపోయేవారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కుటుంబం తెలంగాణ.. మోదీ కుటుంబం అదానీ: గంగుల
రాష్ట్ర పర్యటనకు ప్రధాని మోదీగా వచ్చారా? పార్టీ వ్యక్తిగా వచ్చారా? అని మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. ప్రధాని హోదాలో మోదీ రేషన్ బియ్యంపై అబద్ధాలు మాట్లాడారని, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా కేంద్రం ఇవ్వలేదని ఆరోపించారు. 2014లో రాష్ట్రంలో ఉన్న 53 లక్షల రేషన్ కార్డులను 91 లక్షలకు పెంచి ఒక్కోక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్న మానవతా ప్రభుత్వం తమదని వివరించారు. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా రూ. 27 వేల కోట్ల అదనపు భారం పడుతున్నా.. పేదలను ఆదుకోవాలన్న తపనతో సీఎం కేసీఆర్ బియ్యం పంపిణీ అందజేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో పండిన పంట కొనమని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కోరితే నూకలు తినాలని తెలంగాణ ప్రజలను అవమాన పరిచిన సందర్భాన్ని మరచిపోమని చెప్పారు. తెలంగాణ అంతా కేసీఆర్ కుటుంబం అయితే.. మోదీది అదానీ కుటుంబమని విమర్శించారు.
ఢిల్లీ నుంచి వచ్చి తిట్టిపోవాలా?
రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం ప్రధాని మోదీకి తగదని మంత్రి తలసాని హితవు పలికారు. హైదరాబాద్ వచ్చి మరీ తిట్టిపోవాలా? అదేదో ఢిల్లీలోనే ఉండి తిట్టొ చ్చు. వారం పదిరోజులుగా హైరానా? ఏర్పాట్లు.. కార్యకర్తలను కష్టపెట్టుడు అన్నీ దండుగ కదా! అని ఎద్దేవా చేశా రు. బీజేపీ నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకుబోమని ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.