హైదరాబాద్ : ప్రజలకు కాంగ్రెస్(Congress) పార్టీ ఏం చేసిందని ఓటు వేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. బుధవారం ముషీరాబాద్, అంబర్ పేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..40 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. 130 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ను ఈ ఎన్నికలలో ప్రజలు బొంద పెడతారన్నారు.
ఓటమి తప్పదనే భయంతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారని ఎద్దేవా చేశారు. రెండు సీట్లు గెలిచిన బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని ఎలా చేస్తారు? కేంద్రమంత్రిగా పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ అంబర్ పేట నియోజకవర్గంలో కానీ ఎన్ని నిధులు ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వమే నని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.