హైదరాబాద్ : పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ అనేక విధాలుగా ప్రోత్సాహకాలు అందజేస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో విజయ డెయిరీ ఆధ్వర్యంలో ఐస్క్రీమ్లను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు 66 నూతన పుష్ కార్ట్ ( ట్రై సైకిల్స్)ను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అదేవిధంగా విజయ ఔట్లెట్ల నిర్వహకులకు 50శాతం సబ్సిడీపై ఫ్రిజ్లను అందజేశారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా, డైరెక్టర్ రాంచందర్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ విజయారెడ్డి, డెయిరీ అధికారులు మల్లికార్జున్, మల్లయ్య, అరుణ్, కామేశ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాడి పరిశ్రమ రంగ అభివృద్ధికి ప్రభుత్వం అనేక విధాలుగా ప్రోత్సాహకాలు అందజేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు సరిపడా పాలు రాష్ట్రంలో ఉత్పత్తి కాకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసుకోవాల్సి వస్తుందని తెలిపారు. రాష్ట్ర అవసరాలకు సరిపడ పాలను మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసేలా చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనానికి అధికారులతో ఒక కమిటీని నియమించినట్లు వివరించారు. వ్యవసాయం తర్వాత అత్యధిక కుటుంబాలకు పాడి పరిశ్రమ రంగం జీవనాధారంగా ఉందని చెప్పారు.
విజయ డెయిరీ ఉత్పత్తులకు ఎంతో ప్రజాధరణ ఉందని, వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు నగరంతో పాటు హైవేలు, పర్యాటక ప్రాంతాలు, ప్రధాన ఆలయాల వద్ద నూతన విక్రయశాలలు ( ఔట్ లెట్)లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డెయిరీ ఐస్ క్రీంలను కూడా ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 250 పుష్కార్ట్లను 50శాతం సభ్సిడీ ప్రారంభించాలని నిర్ణయించడం జరిగిందని, ముందుగా 66 మంది అర్హులకు ఈ పుష్ కార్ట్లను అందజేసినట్లు తెలిపారు.
ఒక్కో పుష్ కార్ట్ విలువ రూ.63,050.. కాగా లబ్ధిదారుడి వాటా రూ.31,525.. విజయ డెయిరీ వాటా రూ.31,525 ఉందని చెప్పారు. పుష్ కార్ట్లు, ఈ కార్ట్ల ద్వారా అనేక మంది నిరుద్యోగ యువత కు ఉపాధి లభిస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ సహకారం, ప్రత్యేక చొరవతో ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలతో మూసివేత దశకు చేరుకున్న విజయ డెయిరీ రూ.750 కోట్ల టర్నోవర్కు చేరుకుందని పేర్కొన్నారు. విజయ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని అదేస్థాయిలో ఉత్పత్తిని పెంచేందుకు రూ.250కోట్ల వ్యయంతో మెగా డెయిరీ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు మంత్రి వివరించారు.