హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై బీజేపీ దుర్మార్గ రాజకీయాలు చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. హిందువులంటే బీజేపీ నేతలే అనేలా వ్యవహరిస్తున్నారని, మరి తాము ఎవరిమని ప్రశ్నించారు. ఎన్టీఆర్ మార్గ్ నుంచి ట్యాంక్బండ్ వరకు గణేశ్ విగ్రహాల నిమజ్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీతో కలిసి తలసాని బుధవారం పరిశీలించారు. అ నంతరం ట్యాంక్బండ్పై మీడియాతో మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించే విధంగా అన్ని పండుగలను గొప్పగా జరపాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ‘కర్ణాటకలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నదో ప్రజలకు తెలుసు. బెంగళూరులో 8 అడుగుల లోపు వినాయకుడి ప్రతిమలను మాత్రమే ప్రతిష్ఠించాలి. అందులో మట్టి వినాయకుడి విగ్రహమే ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం మాత్రం వినాయక విగ్రహాల ఎత్తు విషయంలో ఎలాంటి ఆంక్షలను పెట్టలేదు. అయినా బీజేపీ నేతలు ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు’ అని విమర్శించారు.