హైదరాబాద్: దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో గొర్రె పిల్లల పంపిణీ పథకం అమలవుతున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మునుగోడు ఎన్నికల షెడ్యూల్కు ముందే లబ్ధిదారులకు నగదు బదిలీ ప్రారంభించామన్నారు. తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. కుల వృత్తులకు పునర్వైభవం తీసుకురావడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో రూ.11 వేల కోట్లతో గొర్రె పిల్లల పంపిణీ చేపట్టామన్నారు.
రెండో విడత లబ్ధిదారులందరికీ నగదు బదిలీ చేస్తామని మంత్రి తలసాని స్పష్టం చేశారు. నగదు బదిలీని అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. ఆ పార్టీ చిల్లర రాజకీయాలను ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో చిల్లర రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. కులవృత్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నాయని చెప్పారు. బీజేపీ నేతలు అబద్ధపు మాటలు చెప్తూనే ఉంటారని విమర్శించారు. గొల్లకురుమలకు ఇచ్చే డబ్బులను ఆపడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో ఉపఎన్నిక వస్తుందన్న వార్తలు అవాస్తవమని చెప్పారు. అవన్నీ గాలి వార్తలని కొట్టిపారేశారు. బీజేపీ నేతలు అబద్ధపు మాటలు చెప్తూనే ఉంటారని విమర్శించారు.