హైదరాబాద్: ప్రజలను ఇబ్బంది పెడుతున్న మోదీని, బీజేపీని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశం నుంచి తరిమికొట్టేవరకు బీజేపీకి బుద్దిరాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి కార్యాలయం వద్ద టీఆర్ఎస్ పార్టీ ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. దేశ ప్రజల కోసం ప్రధాని మోదీ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా చేపట్టలేదని విమర్శించారు. టీఆర్ఎస్ చేసి మంచి పనులు 150కిపైగా ఉన్నాయని చెప్పారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు డబుల్ చేసి ప్రజలపై భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయన్నారు. ఎన్నికలైన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారని సీఎం కేసీఆర్ ఆనాడే చెప్పారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఇబ్బడి, ముబ్బడిగా ధరలు పెంచుతుందని విమర్శించారు. ఇప్పటికే కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరాల ధరలు పెరుగుతుండటంతో పేదలు బతకలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.