హైదరాబాద్ : నిన్న హనుమకొండలో నిర్వహించిన కాంగ్రెస్ సభను ఉద్దేశించి.. అది రైతు సంఘర్షణ సభ కాదు.. కాంగ్రెస్ నేతల అంతర్గత సంఘర్షణ సభ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ ప్రభాకర్తో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
వరంగల్ సభలో ప్రకటించిన డిక్లరేషన్ ఆచరణ సాధ్యం కానిదని మంత్రి స్పష్టం చేశారు. ఆ డిక్లరేషన్ రాష్ట్రానికి సంబంధించిందా? దేశానికి సంబంధించిందా? అనే విషయంలో స్పష్టత లేదన్నారు. రాష్ట్ర బడ్జెట్ ఎంత.. హామీల అమలుకు అయ్యే ఖర్చు ఎంత? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే వ్యవసాయం లాభసాటిగా మారిందని స్పష్టం చేశారు. 60 సంవత్సరాలు అధికారంలో ఉన్న మీరు రైతులకు ఏం చేశారో చెప్పగలరా? అని నిలదీశారు. నిజంగా రైతులపై ప్రేమ ఉంటే ఢిల్లీలో రైతులకు మద్దతుగా ధర్నా చేస్తే ఎక్కడికి పోయారని అడిగారు.
పదే పదే తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చెప్పడం సరికాదని మంత్రి తలసాని అన్నారు. కేసీఆర్తో పాటు తెలంగాణ ప్రజలు చేసిన పోరాటానికి తలొగ్గి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. రాహుల్ గాంధీ ఓ పార్ట్టైం పొలిటిషీయన్ అని విమర్శించారు. ఢిల్లీ నాయకులు రాష్ట్రానికి టూరిస్టులుగా వచ్చి వెళ్తున్నారు.. వారితో తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తేల్చిచెప్పారు.