హైదరాబాద్ : ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలు ఉండటం ప్రధానమంత్రి నరెంద్రమోదీకి ఇష్టం లేదని రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు తమ విధానాలతో ప్రపంచ దేశాల ముందు భారతదేశ పరువు, ప్రతిష్టలను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. దేశం సర్వనాశం అవ్వాలని బీజేపీ కోరుకుంటుందని, ఇలాంటి పరిణామాలు దేశానికి మంచిది కాదని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖునీ చేస్తున్నారని, మోడీ, అమిత్ షాలు దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్లో చేసిన విధంగానే మహారాష్ట్రలో కూడా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ ఇవ్వడం, బస్సులు ఏర్పాటు చేయడం అనుమానాలు కలిగిస్తోందని అన్నారు. మహారాష్ట్ర లోని ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్రతోనే ఎమ్మెల్యేలను ఒక చోట నుండి మరో చోటుకు తరలిస్తుందని ఆరోపించారు.
అధికారం శాశ్వతం కాదు… బీజేపీ జీవిత కాలం అధికారంలో ఉండదనే విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. ఎప్పుడు అన్ని మనకు అనుకూలంగా ఉండవని, మహారాష్ట్ర పరిస్థితి బీజేపీకి కూడా వస్తుందని అన్నారు.
బీజేపీ సమావేశాలు హైదరాబాద్లో నిర్వహిస్తున్నారన్న ప్రశ్నకు మంత్రి తలసాని సమాధానం ఇస్తూ హైదరాబాద్ అందాలు, రాష్ట్ర ప్రగతిని మోదీ, బీజేపీ ముఖ్యమంత్రులు వచ్చి చూస్తారని పేర్కొన్నారు. బీజేపీ ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్లో జరిగిన అభివృద్దిని చూసి నేర్చుకునే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హింసను ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్కు వ్యతిరేకంగా యువత ఆందోళనకు దిగితే బీజేపీ నేతలు ఇష్టమొచ్చిన విధంగా మాట్లాడటం సమంజసమేనా అని ప్రశ్నించారు. మీ వైఖరి, విధానాలతో అనేకమంది యువకుల జీవితాలు అంధకారమయంగా మారాయని మంత్రి తలసాని విమర్శించారు.