బన్సీలాల్పేట్, జూలై 14: ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి బాగోలేదని, ఏదైనా మాట్లాడితే ఒళ్లుదగ్గర పెట్టుకొని వ్యాఖ్యలు చేయాలని ఆ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవుపలికారు. శుక్రవారం హైదరాబాద్ బన్సీలాల్పేట్ డివిజన్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వాళ్లు ముందుగా తమ ఇంటిని చక్కదిద్దుకోవాలని బొత్సకు సూచించారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని చెప్పారు. తెలంగాణలోని రైతులందరూ సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని, స్వరాష్ట్రంలోనే వ్యవసాయానికి 24 గంటలపాటు కరెంట్ సరఫరా జరుగుతున్నదని గుర్తుచేశారు. పంట పెట్టుబడి కోసం రైతుబంధు ద్వారా ఆర్థిక సాయం, సకాలంలో విత్తనాలు, ఎరువులను అందిస్తున్నది తమ ప్రభుత్వామేనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పరితీరుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులే నిదర్శనమని పేర్కొన్నారు. వ్యవసాయానికి కేవలం 3 గంటల విద్యుత్తు సరఫరా చాలనడం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ఇలాంటి అర్థరహితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహించారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేయకూడదని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వారికి కనిపించడంలేదా అని ప్రశ్నించారు.