హైదరాబాద్ : గవర్నర్ వ్యవస్థ వద్దని ఎప్పట్నుంచో డిమాండ్ ఉందని, ఆ వ్యవస్థ అసరమే లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. గవర్నర్ మీడియాతో రాజకీయాలు మాట్లాడటం సరికాదు. గవర్నర్లు వారి పరిమితులకు లోబడి మాట్లాడాలని సూచించారు. గవర్నర్లను ఎలా గౌరవించాలో సీఎంకు, మాకు తెలుసన్నారు. గవర్నర్లను గౌరవించడంలో సీఎం కేసీఆర్ అందరికంటే ముందుంటారని తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు జరగనప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు.
ప్రధాని, కేంద్రమంత్రిని కలిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ విమర్శలు చేయడం ఏంటి? అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న, మెజార్టీ ఉన్న ప్రభుత్వాన్ని గవర్నర్ ఎలా రద్దు చేస్తారు? పెద్దల సభలో నియామకాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను రాజ్యసభకు పంపలేదా? అని ప్రశ్నించారు. డ్రగ్స్ విషయంలో కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు. డ్రగ్స్ దందాలో ఎంతటి వారున్నా ఉపేక్షించొద్దని సీఎం అధికారులను ఆదేశించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.