హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీకి అతిగతి లేక చిల్లర రాజకీయాలు చేస్తోందని, ఆ పార్టీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ఎల్పీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ నాయకులు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ము బీజేపీకి ఉందా? అని సవాల్ విసిరారు. దేవాలయాలు ఎవరి ఆధ్వర్యంలో అభివృద్ధి అయ్యాయో చర్చకు సిద్ధమా? అని అడిగారు. యాదాద్రి, భద్రాచలం పోదామా? అభివృద్ధి చూస్తావా? అని చౌహాన్ను తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు.
బీజేపీ డ్రామాలడుతూ ప్రజలను రెచ్చగొడుతుందని మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయని మోదీ మొసలి కన్నీరు పెడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. ఉద్యోగాల భర్తీ అంశంపై కేంద్రం చర్చకు సిద్ధమా? అని మంత్రి అడిగారు.