Minister Srinivas Yadav | ప్రజల బాధలన్నీ తీర్చానని.. ఎన్నికల్లో మరోసారి గెలిపించే బాధ్యత మీదేనని మంత్రి తలసాని, బీఆర్ఎస్ సనత్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్పేట డివిజన్ బీజేఆర్నగర్, ముస్లింబస్తీ, బండ మైసమ్మనగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మొదట బాబు జగ్జీవన్రాం, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాలువాలు కప్పి మంగళహారతులతో స్వాగతం పలికారు.
బస్తీల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని, సమస్యల పరిష్కారానికి కృషి చేసిన కారు గుర్తుకే ఓటేస్తామని ముక్తకంఠంతో నినదించారు. బన్సీలాల్పేట డీ క్లాస్లో జేఎన్ఎన్ఆర్ఎం ఇండ్ల వద్ద మహిళలు, బండ మైసమ్మనగర్ డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద మంత్రిపై పుష్ప వర్షం కురిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మురికి కూపాలు, ఇరుకైన ఇండ్లలో కనీస సౌకర్యాలు ఇబ్బందులుపడుతుండడం చూసి అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఉచితంగా నిర్మించినట్లు చెప్పారు.
స్థానికంగా సీసీకెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని, కమ్యూనిటీ హాల్ను సైతం నిర్మిస్తామని చెప్పారు. జేఎన్ఎన్యూఎఆర్ఎం ఇండ్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మాణం చేపట్టి.. 70వేల ఇండ్లను అర్హులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. మరో లక్ష ఇండ్లను సైతం నిర్మిస్తామన్నారు. కానీ, ప్రతిపక్ష పార్టీల నేతలకు ఆ ఇండ్లు కనిపించకపోవడం విచారకరమన్నారు.
కొందరు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వస్తారని.. తాను మాత్రం నిత్యం ప్రజలలోనే ఉంటాననే విషయం అందరికీ తెలుసునన్నారు. నిత్యం జనం మధ్యనే ఉంటూ.. ఏ అవసరం ఉన్నా అండగా ఉంటున్నానన్నారు. సమస్యలను పరిష్కరించి.. అభివృద్ధికి కృషి చేసిన తనను కారు గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.