హైదరాబాద్: మన సంస్కృతి, సాంప్రదాయాలను పండుగలు చాటి చెబుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) బోనాలను (Bonalu) రాష్ట్ర పండుగగా ప్రకటించారని చెప్పారు. ఎంతో విశిష్టత కలిగిన బోనాల ఉత్సవాలు నేడు విశ్వవాప్తం అయ్యాయని తెలిపారు. ఆషాఢ బోనాల జాతర సందర్భంగా హైదరాబాద్లోని గోషామహల్, మలక్పేట, కంటోన్మెంట్ నియోజకవర్గాల పరిధిలోని దేవాలయాలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బోనాల ఉత్సవాల ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేట్ దేవాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
ఈ నెల 16న జరిగే పాతబస్తీ (Old city) బోనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. 26 దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తామని వెల్లడించారు. బోనాల సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.