హైదరాబాద్ : ఉద్యమమే ఊపిరిగా జీవించిన మహనీయుడు, కవి కాళోజీ నారాయణ రావు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం రవీంద్రభారతిలో నిర్వహించిన కాళోజీ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. కాళోజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ప్రజా కవిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా పని చేశారని చెప్పారు.
1992లో భారతదేశ అత్యున్నత పద్మ విభూషన్ పురస్కారాన్ని పొందారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం సెప్టెంబర్ 9 వ తేదీన కాళోజీ జయంతని అధికార భాషా దినోత్సవంగా నిర్వహిస్తూ ఆయన సేవలను స్మరించుకుంటూ గౌరవిస్తుందని పేర్కొన్నారు. కొందరు మరణించినా ప్రజల మనస్సులో ఎల్లప్పుడూ జీవించే వారు కొందరే ఉంటారని, అందులో కాళోజీ నారాయణ రావు ఒకరని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాళోజీ స్మారక అవార్డు కు ఎంపికైన కవి జయరాజ్ను మంత్రి సన్మానించారు.