హైదరాబాద్ : రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అధికారులను ఆదేశించారు. శనివారం బీఆర్కే(BRK) భవన్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary) శాంతి కుమారితో కలిసి 2 వ విడత గొర్రెల పంపిణీ పై జిల్లా కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్(Video Conference) నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మానసపుత్రిక గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని 2017 లో ప్రారంభించగా రాష్ట్రంలో 7.31 లక్షల మంది గొర్రెల పెంపకందారులను అర్హులుగా గుర్తించామని వెల్లడించారు.మొదటి విడతలో 50 శాతం మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేశామని వివరించారు.మిగిలిన వారికి రెండవ విడతలో పంపిణీ చేస్తామని ప్రకటించారు.
గొర్రెల రవాణాకు జీపీఎస్ (GPS) సౌకర్యం తో కూడిన వాహనాలను ఉపయోగిస్తామని వెల్లడించారు.రాష్ట్రంలో పెరిగిన గొర్రెల సంపదకు అనుగుణంగా దాణా కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులు తమ సొంత భూములలో పశుగ్రాసం పెంచుకొనేందుకు సబ్సిడీపై గడ్డి విత్తనాలను సరఫరా చేస్తామని అన్నారు.