హైదరాబాద్ : పేదలకు వైద్యం అందుబాటులో ఉంచేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) తెలిపారు. శుక్రవారం అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని గోల్నాక డివిజన్ సుందర్ నగర్ బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన(Basti Hospital) ను స్థానిక ఎమ్మెల్యే (MLA) కాలేరు వెంకటేష్ తో కలిసి ప్రారంభించారు.
మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో వైద్యం ఎంతో ఖరీదైందని, పేదలు అధికంగా నివసించే బస్తీలలోనే బస్తీ దవఖాన లను ఏర్పాటు చేస్తుందని వివరించారు. జీహెచ్ఎంసీ(GHMC ) పరిధిలో 350 బస్తీ దవాఖాన ల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ జిల్లాకు నూతనంగా 14 బస్తీ దవాఖాన లు మంజూరైనట్లు వెల్లడించారు. బస్తీ దవాఖానా లలోనే అన్ని రకాల వైద్య పరీక్షలు, మందులు అందుబాటులో ఉండటం వలన ప్రధాన ప్రభుత్వ హాస్పిటల్స్ కు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత వేలాది కోట్ల రూపాయలతో ప్రభుత్వ హాస్పిటల్స్ ను కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా అభివృద్ధి చేసిందని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు(Harish Rao) బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిటీ స్కాన్,ఎంఆర్ఐ( MRI ), క్యాత్ ల్యాబ్ వంటి అత్యాధునిక పరికరాలను సమకూర్చిందని తెలిపారు. నిమ్స్ ఆసుపత్రుల్లో 2 వేల పడకల హాస్పిటల్ గా అభివృద్ధి చేసే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఎల్బీనగర్ కొని కొత్తపేట, ఎర్రగడ్డ, అల్వాల్ తదితర ప్రాంతాలలో ప్రభుత్వం మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తుందని వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలతో రానున్న రోజులలో హైదరాబాద్ మెడికల్ హబ్ గా అభివృద్ధి చెందబోతుందని చెప్పారు.ఈ సందర్భంగా బస్తీ దవాఖానలో మంత్రి బీపీచెక్ చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్, కార్పొరేటర్ లావణ్య, డాక్టర్ దీప్తి తదితరులు పాల్గొన్నారు.