శంషాబాద్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటుందని రాష్ట్ర యువజన క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud ) తెలిపారు. మంగళవారం ఫోటోగ్రఫి వ్యవస్థాపకుడు లూయిస్ జ్యాక్విన్ మాంజ్ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఫోటోగ్రాఫర్ల (Photographers) సంఘం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లిలో నిర్వహించిన మహాసభలో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కలిసి పని చేసిన ఫోటో గ్రాఫర్లను ఆదుకోవడం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వారికి గుర్తింపు కార్డు అందిస్తామని చెప్పారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఫోటోగ్రాఫర్లకు భవనలకు స్థలం కేటాయిండంతో పాటు భవన నిర్మాణం చేసి ఆదుకున్నట్లు వివరించారు. ఎస్సీలకు దళితబంధు(DalitBandu), బీసీలకు బీసీ బంధు, మైనార్టీలకు కార్పొరేషన్ ద్వారా ఆదుకుంటున్నట్లు చెప్పారు. అర్హులైన ఫోటోగ్రాఫర్ల్లు వారి వారి సామాజిక వర్గాలలో సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, కాలే యాదయ్య, జైపాల్యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ (CM KCR ) దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా నాయకుడు క్యామ మల్లేష్, శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ గోపాల్, వెంకటేశ్ గౌడ్, ఫోటోగ్రాఫర్ల రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్, వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకట్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శివలింగంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.