జనగామ : జిల్లా పర్యటనలో భాగంగా సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం రఘనాధపల్లి మండలం ఖిలాపురం గ్రామంలో గల సర్వాయి పాపన్న కోట నిర్మాణ పనులను పరిశీలించారు. కోట కూలి ఇల్లు ధ్వంసమైన దళిత కుటుంబాలకు వారం రోజుల్లో ఇంటి స్థలం కేటాయించి ఇండ్లు నిర్మించి ఇస్తామని మంత్రి హామీనిచ్చారు.
అలాగే ఖిలాషాపూర్ కోట అభివృద్ధి తరహాలో తాటికొండలోని పాపన్న కోటకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల నాటికి కోట పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.