హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ)/వనపర్తి: మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న కృషిని చూసి ఓర్వలేకనే ఈడీ నోటీసులు ఇచ్చారని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ను సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా దశాబ్దాల కరువును పారదోలిన ఘనత సీఎం కేసీఆర్కు దకుతుందని కొనియాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో జిల్లా శాశ్వతంగా సుభిక్షంగా మారుతుందని అన్నారు.
ఇది నిజంగా పాలమూరుకు పండుగ రోజు అని పేర్కొన్నారు. పాలమూరు దశాబ్దాల కలను సాకారం చేసిన మహనీయుడు సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు 16న పల్లె పల్లె కదలి రావాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్కు ఇతర రాష్ర్టాల్లో లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కవితపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కుటుంబాన్ని కట్టడి చేస్తే కేసీఆర్ ఆగుతారని బీజేపీ భ్రమ పడుతున్నదని చెప్పారు. తాటాకు చప్పుళ్లకు సీఎం కేసీఆర్ భయపడరని, కవితకు ఏమైనా అయితే మహిళాలోకం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు.