హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ సంపదగా యూనెస్కో గుర్తింపు పొందిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు.
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు గర్భాలయ ముఖమండపంలోని నాలుగు స్తంభాల నుంచి కారుతున్న నీటి లీకేజీలకు వెంటనే మరమ్మతులు చేయాలని కేంద్ర పురావస్తుశాఖ (ఏఎస్ఐ) తెలంగాణ సర్కిల్ సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ చేశారు. రామప్ప ఊరుస్తుందని ఓ పత్రికలో వచ్చిన కథనంపై మంత్రి స్పందించారు. సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టంచేశారు. రామప్పను పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందిగా తెలంగాణ పురావస్తుశాఖ డిప్యూటీ డైరెక్టర్ నారాయణను మంత్రి ఆదేశించారు.