Minister Srinivas Goud | న్యూఢిల్లీ : బీఆర్ఎస్( BRS Party ) నేతలను గొంతు నొక్కాలని చూస్తే జరిగే పని కాదు. ఉద్యమాల గడ్డ తెలంగాణ( Telangana ).. కేసులకు భయపడేది లేదు అని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తేల్చిచెప్పారు. కేంద్రానికి చేతనైతే విదేశాల్లో దాక్కున్న దొంగలను తీసుకురావాలి. కానీ ఆడబిడ్డలను గంటల తరబడి ఈడీ ఆఫీసు( ED Office )లో కూర్చోబెట్టడం సరికాదన్నారు. బీఆర్ఎస్, కేసీఆర్ను ఎదుర్కోలేక తప్పుడు కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.
న్యూఢిల్లీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) సెల్ఫోన్లు ధ్వంసం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy ) ఎలా చెబుతారు? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఫోన్లు ధ్వంసం చేశారని కిషన్ రెడ్డి ఏ ఆధారాలతో చెప్పారు. మార్చిలో విచారణకు పిలిచారు.. కానీ నవంబర్లోనే ఫోన్లు ధ్వంసం చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కానీ ఇవాళ కవిత తన మొబైల్స్ణు ఈడీకి అప్పగించారు. తప్పు చేయలేదు కాబట్టి ఎమ్మెల్సీ కవిత భయపడటం లేదన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా బీజేపీ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఒక మహిళ గోప్యత, ప్రతిష్ఠ దెబ్బతినేలా బీజేపీ నేతలు మాట్లాడారు. కొన్ని మీడియా సంస్థలు గాలి వార్తలతో పైశాచిక ఆనందం పొందాయి. కిషన్ రెడ్డి ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు. ఎమ్మెల్సీ కవితకు కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
వేల కోట్లు ఎగవేసిన నీరవ్ మోదీ, లలిత్ మోదీని కేంద్రం ఎందుకు వదిలేసింది అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా ఎక్కడున్నారు..? దేశ సంపదను దోచుకుని లండన్ పారిపోయిన వారిని ఎందుకు రప్పించట్లేదు. లక్షల కోట్లు కొల్లగొట్టిన కేసులను వదిలేసి రూ. 100 కోట్ల స్కామ్ అంటూ మహిళపై కేసులు పెడుతున్నారు. మహిళ అని చూడకుండా గంటల కొద్దీ కూర్చోబెట్టి వేధిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే స్కామ్ అని ఎలా అంటారు అని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారం శాశ్వతం కాదు. బీజేపీలో చేరగానే గంగానదిలో స్నానం చేసినట్లు పాపాలు పోతాయని అనుకుంటున్నారు. బీజేపీలో చేరిన అక్రమార్కులపై కేసుల్లేవు.. విచారణలు లేవు అని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.