హైదరాబాద్, మార్చి 21(నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ తన దొంగ దోస్తులను వదిలేసి రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ బిడ్డ కవితను వేధిస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వేల కోట్లు దోచుకున్న లలిత్ మోదీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి వారు విదేశాల్లో జల్సా చేస్తుంటే.. ఏ తప్పు చేయని కల్వకుంట్ల కవితను విచారణ పేరుతో వేధించడం ఏమిటని ప్రశ్నించారు. శనివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రూ.లక్షల కోట్ల కుంభకోణం జరిగినట్టు ఆధారాలతో సహా బయటపడిన అదానీపై ఎందుకు విచారణ జరపడం లేదని నిలదీశారు. బీజేపీని, మోదీని ప్రశ్నిస్తున్న సీఎం కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే ఆడబిడ్డను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎమ్మెల్సీ కవిత కోట్ల విలువగల ఫోన్లు ధ్వంసం చేశారంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా కిషన్రెడ్డి అలా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. ‘ఫోన్లు ఉన్నాయా? ఉంటే ఏమయ్యాయి?’ అని కవితను ఈడీ అడగనే లేదని.. బీజేపీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఎమ్మెల్సీపై దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తన ఫోన్లన్నీ భద్రంగా ఉన్నాయని ఇప్పటికే కవిత ఈడీకి లేఖ రాశారని చెప్పారు. ‘ఫోన్లు ఇవ్వాలంటూ సోమవారం ఈడీ అడిగితే.. మంగళవారం ఉదయమే వాటిని కవిత అప్పగించారు. మరి ఫోన్లు ఎక్కడ ధ్వంసమయ్యాయో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి. కిషన్రెడ్డీ.. ఇప్పుడు తల ఎకడ పెట్టుకుంటారు?’ అని శ్రీనివాస్గౌడ్ నిలదీశారు. ఆడబిడ్డ అని చూడకుండా ఫోన్లు ధ్వంసం చేశారని ప్రచారం చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ‘మీకూ బిడ్డ ఉన్నది. మరో ఆడబిడ్డపై మాట్లాడేప్పుడు ఆలోచించి మాట్లాడాలి’ అని హితవు పలికారు. తప్పుడు ప్రచారం చేసిన కిషన్రెడ్డి సమాధానం చెప్పి.. క్షమాపణ కోరాలని శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. అధికారం వారి చేతిలో ఉందని ఇష్టారీతిన వ్యవహరిస్తే ఉరుకోబోమని, ఇది తెలంగాణ గడ్డ అని మంత్రి హెచ్చరించారు. తెలంగాణ బిడ్డపై ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు క్షమించరని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం, మోదీ బెదిరింపులకు తెలంగాణ సమాజం భయపడబోదని శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు. మోదీ దుర్నీతిని ఎదిరిస్తూనే ఉంటామన్నారు. తెలంగాణ రాష్ట్రమన్నా, దేశమన్నా సీఎం కేసీఆర్కు ప్రాణమని.. వాటి రక్షణ కోసం ఏదైనా చేస్తారని అన్నారు. దేశం మీద గౌరవం ఉంటే.. దేశాన్ని దోచుకునే వాళ్లను ఢిల్లీ గడ్డపై ఉరితీయాలని డిమాండ్ చేశారు. గంగలో మునిగితే పాపాలు పోయినట్టు ఎన్ని కేసులున్నా బీజేపీలో చేరితో కేసులు మాయమైపోవడం దర్యాప్తు సంస్థల నిష్పాక్షికతను ప్రశ్నార్థకం చేస్తున్నదన్నారు. దేశం అన్నీ గమనిస్తున్నదని, సరైన సమయంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
దేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ ఎదిరిస్తున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ మాత్రమేనని శ్రీనివాస్గౌడ్ అన్నారు. కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే ఆయన కూతరు కవితను టార్గెట్ చేశారని విమర్శించారు. ‘ఆడబిడ్డపైనా మీ ప్రతాపం..’ అని మోదీని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలూ లేకపోయినా.. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, కవితను ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన ఆడబిడ్డను పండుగ అని కూడా చూడకుండా హింసిస్తున్నారని అన్నారు. ఇది ఊరికే పోదని.. బీజేపీకి, మోదీకి తగిన గుణపాఠం చెప్తామని అన్నారు.