హైదరాబాద్ (నమస్తే తెలంగాణ)/మహబూబ్నగర్ అర్బన్, జూలై 5 : దక్షిణ కొరియా తరహాలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అమ్యూజ్మెంట్ పార్కు ఏర్పాటు చేస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మంగళవారం దక్షిణ కొరియా రాజధాని సియోల్లో పర్యాటక శాఖ ఎండీ మనోహర్, అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దక్షిణ కొరియాలో ఉన్న అద్భుతమైన పర్యాటక సొబగులను రాష్ట్రంలోనూ తెస్తామని చెప్పారు.
సియోల్ నగరంలోని డీమిలిటరీ జోన్ సమీపంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ పార్క్ అద్భుతంగా ఉందని, ఇలాంటి పార్కును మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామం వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో ఐదు నెలల్లో నిర్మించి, ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. మహబూబ్నగర్ తర్వాత హైదరాబాద్లోనూ ఏర్పాటు చేస్తామని అన్నారు. పాలమూరును టూరిజం డెస్టినేషన్గా మారుస్తామని మత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు.
దక్షిణ కొరియాలోని ఇండియన్ అంబాసిడర్ అమిత్కుమార్తో మంత్రి శ్రీనివాస్గౌడ్ భేటీ అయ్యారు. పర్యాటక, క్రీడా రంగాల్లో దక్షిణకొరియా సాధించిన అభివృద్ధిపై చర్చించారు. సమావేశంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.