మహబూబ్నగర్: తెలంగాణ ఏర్పడిన తర్వాతే కులవృత్తులకు న్యాయం జరుగుతున్నదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే గోపాల మిత్రలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. మహబూబ్నగర్లోని బండమీదిపల్లిలోని పరిశోధనా కేంద్రం ఎక్కడికీ తరలిపోదని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో గోపాలమిత్రల వేతనం రూ.3 వేలు మాత్రమే ఉండేదని, తెలంగాణ ఏర్పడిన తర్వాత దానిని రూ.11 వేలకు పెంచామన్నారు.
గోపాల మిత్రల సేవలు విస్తరించడంతోనే పశుసంపద పెరిగి పాల ఉత్పత్తిలో రాష్ట్రం ముందుందని చెప్పారు. పాడి పరిశ్రమను ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. గోపాల మిత్రల సేవలు ఎంతో విలువైనవని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో తాము సంతోషంగా ఉన్నామని, గుర్తింపు, గౌరవం లభిస్తున్నాయని గోపాల మిత్రలు పేర్కొనడం సంతోషకరమన్నారు.
మహబూబ్నగర్ జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానానికి తీసుకుపోవడమే తమ లక్ష్యమని మంత్రి చెప్పారు. అందులో భాగంగానే గతంలో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలో నూతన కోర్టు కాంప్లెక్స్ భవన నిర్మాణం కోసం వెటర్నరీ పాలిటెక్నిక్ సమీపంలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించామని, దానికి బదులుగా పశుపరిశోధన కేంద్రానికి 20 ఎకరాల భూమిని కేటాయిస్తున్నామని తెలిపారు. వెటర్నరీ పాలిటెక్నిక్, పశుపరిశోధన కేంద్రం ఇక్కడి నుంచి తరలిపోతున్నాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని ఎక్కడికీ తరలించడం లేదని స్పష్టం చేశారు.