తిరుమల: రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ (CM KCR) మూడోసారి అఖండ విజయం సాధించి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, వారి అడుగుజాడల్లో పనిచేసేందుకు మరోసారి అవకాశం కల్పించాలని శ్రీవారిని వేడుకున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) అన్నారు. సోమవారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీ-ఫారమ్ అందుకున్న అనంతరం నేరుగా తిరుమల వచ్చి స్వామి వారి దర్శనం చేసుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచామని, ప్రస్తుతం రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి అడుగుజాడల్లో నడుస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులోనూ వారితోపాటు కలిసి పనిచేసే అవకాశం కల్పించాలని భగవంతుణ్ణి వేడుకున్నట్లు తెలిపారు. దేశానికే అన్నపూర్ణగా మారిన తెలంగాణలో పేదరిక నిర్మూలనలో ఆదర్శ రాష్ట్రంగా మారిందన్నారు. పేద, బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలిచిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో తెలంగాణ అన్ని రంగాల్లోనూ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలుస్తుందన్నారు.
తిరుమల దర్శనానికి వచ్చే తెలంగాణ భక్తులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని కోరారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో వచ్చే భక్తులకు ప్రస్తుతం ఇస్తున్న టిక్కెట్లకు అదనంగా నిత్యం మరో 500 టిక్కెట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి విజ్ఞప్తికి టీటీడీ చైర్మన్ సానుకూలంగా స్పందించారు.