Srinivas Goud | హైదరాబాద్ : బీసీ గణన నిర్వహించకుండా, మంత్రిత్వశాఖ ఇవ్వకుండా, రిజర్వేషన్లు అమలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మనకు అన్నివిధాలుగా అండగా ఉంటున్న కేసీఆర్ సర్కార్కు అండగా నిలవాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన నిర్వహించిన జయంతి వేడుకల కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండాప్రకాష్, బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ సంఘాల నేతలు, పూలే అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మహాత్మా జ్యోతిభాపూలేకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. నేడు బీసీలు ఉన్నత చదువులు చదివి అంతో ఇంతో వివిధ హోదాల్లో ఉండడానికి కారణం మహాత్మాజ్యోతిభా పూలేనే అని పేర్కొన్నారు. ఫూలే ఆదర్శాలతోనే బాబాసాహెబ్ అంబేద్కర్, సాహు మహారాజ్ రిజర్వేషన్లను తీసుకొచ్చారన్నారు. గతంలో పట్టుమని పదిమందికూడా విద్యార్థులు లేని హాస్టళ్లలో నీళ్లచారుతో, ఉడకని అన్నంతో ఇబ్బందులు పడ్డామని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో బీసీలకు 310 హాస్టళ్ల ద్వారా ప్రపంచస్థాయి విద్యను అందిస్తున్నారన్నారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్వాయి పాపన్న తదితర బీసీ బిడ్డల వేడుకలను రాష్ట్ర పండుగలుగా నిర్వహించుకొని వారిని ఘనంగా స్మరించుకుంటున్నామన్నారు. విభజించి పాలించే రాజకీయ పార్టీల కుట్రల్ని గమనించాలని శ్రీనివాస్ గౌడ్ సూచించారు.