Telangana Decade Celebrations | తెలంగాణ తొమ్మిదేళ్ల విజయాలను ప్రతి ఒక్కరికీ చెప్పేలా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో సోమవారం మహబూబ్నగర్ కలెక్టరేట్లో సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జూన్ 2 నుంచి 22 వరకు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణను తీసుకువచ్చామన్నారు. తొమ్మిదేళ్లలో వివిధ అంశాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలబడి జాతీయస్థాయిలో సింహభాగాన్ని ఆక్రమించిందన్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. గతంలో పాలమూరు అంటే ప్రపంచవ్యాప్తంగా వలసలకు ప్రసిద్ధి అని, అలాంటి ఈ రోజులు మహబూబ్నగర్కు వలస వస్తున్నారన్నారు. జిల్లా అన్నిరంగాల్లో ఎంతో ప్రగతిని సాధించిందని, ఉపాధితో పాటు ఉద్యోగం, వ్యవసాయం, వైద్యం తదితర రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. గతంలో కలెక్టర్లు, పరిపాలన అంటే తెలిసేది కాదని, ఇప్పుడు కేవలంలో గంటల్లో కలెక్టర్ను కలిసే అవకాశం సీఎం కల్పించారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, పారిశ్రామిక రంగం, వ్యవసాయం ఇలా అనేక రంగాలు అభివృద్ధిలో ముందున్నాయన్నారు. 2014కు పూర్వం తెలంగాణ, 2014 తర్వాత తెలంగాణను కళ్లకు కట్టినట్టుగా ప్రజలందరికీ తెలియజేపే బాధ్యత ప్రజాప్రతినిధులతో పాటు, అధికారులందరిపై ఉందన్నారు.
ఉత్సవాలను విజయవంతం చేసే బాధ్యత అధికారులదేనన్నారు. అందరూ హెడ్ క్వార్టర్లోనే ఉండాలని, బాగా పనిచేసిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు సన్మానించనున్నట్లు తెలిపారు. అన్ని కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, సంబంధిత శాసన సభ్యులు ఇతర ప్రజాప్రతినిధుల సమ్మతితో కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అన్నిశాఖలు ప్రగతిని నివేదికలను తయారు చేయాలని ఆదేశించారు. తెలంగాణ సాహిత్య దినోత్సవం సందర్భంగా కవులను, కళాకారులను సత్కరించాలని, తెలంగాణ గిరిజన ఉత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గిరిజనులను పిలిచి సేవాలాల్ మహారాజ్, దేవాలయం మండపం గురించి తెలియజేయాలని, తెలంగాణ మంచినీళ్ల పండుగ సందర్భంగా అన్ని వాటర్ ట్యాంకుల వద్ద గతంలో నీటి కోసం మహిళలు పడిన ఇబ్బందులు, ప్రస్తుత పరిస్థితిపై నాడు- నేడు ఫొటోలతో తెలియజేసే ప్రయత్నం చేయాలని సూచించారు.