హైదరాబాద్ : బేగంపేట హరితప్లాజాలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నగరంలోని పబ్బుల యాజమాన్యాలతో సమావేశం అయ్యారు. పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం ఆరోపణలు, శబ్ద కాలుష్యంపై సమీక్షించారు. పబ్బులు పాటించాల్సిన నియమాలు, అధికారుల చర్యలపై పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పబ్బుల్లో డ్రగ్స్ వినియోగిస్తే యాజమాన్యాలదే బాధ్యత అని హెచ్చరించారు. పబ్బుల్లో నిర్వహించే కార్యకలాపాలను యాజమాన్యాలు గమనించాలన్నారు. కార్యకలాపాలను గమనించకపోతే పబ్బులను మూసివేయాలని ఆదేశించారు. శబ్ద కాలుష్యంతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ సరఫరా చేస్తూ కనిపిస్తే 1800 425 2523 నంబర్కు తెలుపాలని ప్రజలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు.