హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో గుడుంబాను 100 శాతం నిర్మూలించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘నీరా కేఫ్’ ప్రారంభోత్సవం పై చర్చించారు. ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారుల పనితీరును మెరుగుపరచుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నీరా కేఫ్కు అనుబంధంగా ఉన్న చిల్లింగ్ ప్లాంట్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి సందర్భంగా అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో గుడుంబా నిర్మూలన 100 శాతం పూర్తిగా జరగాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గుడుంబాతో ఏ ఒక్క గిరిజన మహిళ తన భర్తను కోల్పోకుండా గుడుంబా తయారీ అమ్మకం దారులపై ఉక్కు పాదం మోపాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, కమిషనర్ అజయ్ రావు, డిప్యూటీ కమిషనర్లు డేవిడ్ రవికాంత్ , కేఏబీ శాస్త్రి, సహాయ కమిషనర్ చంద్రయ్య, ఈఎస్లు విజయ్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.