మహబూబ్నగర్, జనవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మంలో బుధవారం బీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడే ప్రతి మాటను.. ప్రతి ఇంటా.. ప్రతి ఒక్కరూ వినాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. ఆద్యంతం సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ప్రజలకు వినిపించేందుకు మహబూబ్నగర్ నియోజకవర్గంలో 100 ఓటర్లకు ఒక టీవీ చొప్పున సుమారు 5 వేల టీవీలను సిద్ధం చేసినట్టు మంత్రి వెల్లడించారు.
ఈ సభకు రాలేని వారంతా స్థానికంగానే ఉండి ముఖ్యమంత్రి ప్రసంగాన్ని శ్రద్ధగా వినాలని కోరారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా ఏనుగొండలోని జేజేఆర్ గార్డెన్స్లో బీఆర్ఎస్ పాలమూరు పట్టణ, రూరల్ మండల ముఖ్య కార్యకర్తలు, వార్డు ఇన్చార్జిల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ విధానాలను దేశమంతటికీ తెలియజేసేందుకే ఈ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
తెలంగాణ మాదిరిగా సంక్షేమ పథకాలను అన్ని రాష్ట్రాలకూ విస్తరించి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కదిలారని వివరించారు. గ్రామాలు, వార్డుల్లో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి సంక్షేమ పథ కాలు, అభివృద్ధి పనులపై ప్రజలకు వివరిస్తూ చర్చించాలని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని, ఈ అంశంపై ప్రజలను ఎప్పటికప్పుడు జాగృతం చేయాలని పిలుపునిచ్చారు.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు సహా అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, పక్కనే ఉన్న కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఈ తరహా పథకాలేవీ అమలు చేయడం లేదన్న విషయాన్ని ప్రజలకు తెలపాలని దిశానిర్దేశం చేశారు. 2014 ఎన్నికల సందర్భంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఎన్నికల తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయారని మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు.