హైదరాబాద్ : కేంద్రం ఒక్కొ రాష్ట్రాన్ని ఒక్కో విధంగా చూడకుండా.. అన్ని రాష్ట్రాలను ఒకేలా చూడాలని, తెలంగాణపై వివక్ష చూపొద్దని రాష్ట్ర పర్యాటశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కొన్ని రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రే చూపకుండా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత విశిష్టతను గత పాలకులు తొక్కిపెట్టారని ఆరోపించారు. భూదాన్ పోచంపల్లికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. పోచంపల్లి ఇన్ని రోజులు ఎందుకు గుర్తింపు రాలేదో ఆలోచన చేయాలన్నారు.
ప్రపంచ స్థాయి గుర్తింపు పొందగలిగిన అనేక ప్రదేశాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయని చెప్పారు. ఇక్కత్ చీరలకు పోచంపల్లి ప్రసిద్ధి చెందిందని, 2005లోనే జీఐ గుర్తింపు వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన కొద్ది రోజుల్లోనే రామప్పకు ఏడున్నర ఏళ్లలో రామప్పకు, పోచంపల్లికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం గర్వంగా ఉందన్నారు. నిజాం ప్రభుత్వ హయాంలో అగ్గిపెట్టెలో చీరను నెచిన ఘనత భూదాన్ పోచంపల్లిది అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్కు ఇచ్చిన చీర పోచంపల్లిదే అన్నారు.
స్కిల్ సిటీ ఆఫ్ ఇండియాగా భూదాన్ పోచంపల్లికి గుర్తింపు ఉందన్నారు. భూదాన్ పోచంపల్లి లాంటి అరుదైన ప్రాంతాలు తెలంగాణ గడ్డపై ఎన్నో ఉన్నాయన్నారు. తాము ప్రయత్నాలు చేస్తే ముందుగా గుర్తింపు వచ్చేది ఇండియాకే అన్నారు. త్వరలోనే బుద్ధవనానికి అంతర్జాతీయ గుర్తింపు రాబోతుందన్నారు. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో టెక్స్టైల్స్పై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. రామప్ప అభివృద్ధికి రూ.300కోట్లు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. భూదాన్ పోచంపల్లికి నిధులు కేటాయించాలని కోరుతూ త్వరలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు.