మహబూబ్నగర్ : సామాజికవేత్త మహాత్మా బసవేశ్వర 889వ జయంతి ఉత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఉన్న మహాత్మా బసవేశ్వర విగ్రహానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బసవేశ్వర జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడమే కాకుండా, ట్యాంక్ బండ్ పై మహాత్మా బసవేశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాక అన్ని జిల్లాలలో అధికారికంగా బసవేశ్వర జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు.
మహాత్మా బసవేశ్వర ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కుల రహిత సమాజ స్థాపనకు కృషి చేసిన వ్యక్తి బసవేశ్వరుడని కొనియాడారు. దానం, ధర్మం, సమ సమాజం కోసం పాటుపడిన సామాజిక వేత్త అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట రావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, రైతుబంధు జిల్లా కో-ఆర్డినేటర్ గోపాల్ యాదవ్, డీసీసీబీ ఉపాధ్యక్ష్యుడు కొరమోని వెంకటయ్య, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఇందిర, శ్రీశైలం, సత్యనారాయణ, పెద్ద రాములు యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, తదితరులు పాల్గొన్నారు.