హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, స్టేట్ టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో సరిహద్దు రాష్ర్టాల చెక్పోస్టుల్లో నిఘాను మరింత పటిష్ఠం చేసి, నకిలీ మద్యం తెలంగాణలోకి సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్శాఖ అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
కర్ణాటక, మహారాష్ట్ర, గోవా నుంచి రాష్ర్టానికి నకిలీ మద్యం రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్శాఖ అధికారులు సమర్థంగా పనిచేయడం వల్ల ఎక్సైజ్ ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. ఇటీవలికాలంలో కొంతమంది అక్రమార్కులు ఎక్సైజ్ ఆదాయానికి గండి కొట్టేలా ఇతర రాష్ట్రాల్లోని మద్యాన్ని తెలంగాణకు సరఫరా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.