మహబూబ్నగర్: రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ కన్నుమూశారు. హైదరాబాద్లో శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో గుండెపోటు రావడంతో ఆమె మరణించారు. శాంతమ్మ అంత్యక్రియలు మహబూబ్ నగర్ పట్టణంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో శనివారం సాయంత్రం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ ఇదే ఏడాది ఫిబ్రవరి 14న మరణించిన విషయం తెలిసిందే.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి అకాల మరణం పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.