హైదరాబాద్ : ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భూదాన్ పోచంపల్లి గ్రామానికి వచ్చిన వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు సర్టిఫికెట్ను సీఎం కేసీఆర్కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్తో పాటు పలువురు పాల్గొన్నారు.
ఇటీవల ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యంలోని యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWT౦) నిర్వహించిన ‘వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్’ అవార్డ్ కోసం సుమారు ప్రపంచ వ్యాప్తంగా 170 దేశాల నుండి వచ్చిన ప్రతిపాదనలలో మన రాష్ట్రం నుండి భూదాన్ పోచంపల్లి గ్రామం బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డ్ ను సాధించిన సందర్భంగా UNWTO వారు అందించిన సర్టిఫికెట్ ను కేసీఆర్కు అందజేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏడేండ్లలో పర్యాటకరంగానికి ఎంతో గుర్తింపు వచ్చింది. ఇటీవల ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్ డబ్ల్యూటీవో) 24వ సర్వసభ్య సమావేశంలో “బెస్ట్ టూరిజం విలేజ్”గా భారతదేశం నుంచి నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 2వ తేదీన స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును స్పెయిన్లోని భారత రాయబార కార్యాలయం దౌత్యాధికారి సుమన్ శేఖర్ స్వీకరించారు. వర్చువల్గా నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భూదాన్పోచంపల్లిని అవార్డుకు ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తొలిసారిగా ప్రపంచ పర్యాటక సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న బెస్ట్ టూరిజం విలేజ్ విభాగానికి అన్ని రాష్ర్టాల నుంచి ఉత్తమ గ్రామాలను ఎంపిక చేసి పంపాలని కేంద్ర పర్యాటకశాఖ ఈ ఏడాది జూన్ 16న కోరిందని తెలిపారు. 75 దేశాల నుంచి 170 ప్రతిపాదనలు వెళ్లాయని చెప్పారు. వీటిలో భారత్ నుంచి మేఘాలయలోని కాంగ్థాన్, మధ్యప్రదేశ్లోని లాడ్పురాఖాస్ కూడా పోటీలో నిలచినా, చివరకు భూదాన్ పోచంపల్లి గ్రామానికే అవార్డు దక్కిందని పేర్కొన్నారు.