మహబూబ్నగర్ : విద్యార్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలు సాధించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ గ్రామీణ మండలం కోట కదిర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్షయపాత్ర సహకారంతో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అక్షయపాత్ర ద్వారా శుక్రవారం నుంచి 4947 మంది విద్యార్థులకు 47 పాఠశాలల్లో నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యా యులు విద్యార్థులకు పది తర్వాత చదివే అంశాలపై అవగాహన కల్పించాలన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా ఊహించిన విధంగా అభివృద్ధి సాధించిందని ఆయన పేర్కొన్నారు. విద్యా పరంగా అనేక మార్పులు వచ్చాయని, రాష్ట్ర వ్యాప్తంగా వేయి గురుకులాలు పెడితే మహబూబ్నగర్లోనే 20 ఉన్నాయి. జిల్లా నుంచి వలసలు వెళ్లే పరిస్థితి నుంచి వలసలు వాపస్ వస్తున్నారని అన్నారు.
మన్నెంకొండ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. అదేవిధంగా ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మాణంలో ఉందని,15 కోట్ల రూపాయలతో టూరిజం హోటల్ ను త్వరలోనే చేపట్టబోతున్నామన్నారు.
కార్యక్రమంలో ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ,జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, రైతుబంధు మండల డైరెక్టర్ మల్లు నరసింహారెడ్డి, డీఈవో రవీందర్, గ్రామ సర్పంచ్ రమ్య, పాల్గొన్నారు.