మహబూబ్నగర్ : గిరిజనుల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ సమీపంలో ఉన్న అయ్యప్ప గుట్టపై కోటి పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గిరిజన భవన్కు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తమ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిందని, దీని వల్ల ఎంతో మంది గిరిజనులు సర్పంచులుగా మారారని తెలిపారు. తండాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
తండాలలో ప్రస్తుతం సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారని, రహదారులు, మిషన్ భగీరథ తాగునీరు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను తండాల్లోనూ అమలు చేస్తున్నామని తెలిపారు. గిరిజనులకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు.
జిల్లాలో ఎంతో మంది గిరిజనులు ఉన్నారని, వారు సమావేశాలు నిర్వహించుకునేందుకు ఈ గిరిజన భవన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. గత సంవత్సరం సేవాలాల్ మహారాజ్ దేవాలయానికి స్థలం ఇచ్చామని మంత్రి తెలిపారు. ఇప్పుడు రూ. కోటి పది లక్షలతో గిరిజన భవన్ కు శంకుస్థాపన చేశామని, ఎనిమిది నెలల్లో ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి గిరిజనులకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా కేంద్రంలో త్వరలోనే గిరిజన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ను, రెసిడెన్షియల్ స్కూల్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. మెట్టుగడ్డ దగ్గర ఉన్న పాత గిరిజన భవనం మరమ్మతులకు రూ.10 లక్షల రూపాయలు మంజూరు చేశామని, దానిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు.
గిరిజన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ను మంగళవారం ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి కులానికి సామాజిక భవనాలతో పాటు వృద్ధాశ్రమాలు, ఇతర భవనాలను నిర్మించి ఇస్తామని మంత్రి వెల్లడించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు, డిటిడిఓ చత్రు, గిరిజన సేవా సంఘం అధ్యక్షుడు రాజు నాయక్, టీఎన్జీవో జిల్లా సెక్రటరీ చంద్రా నాయక్, రాజు నాయక్, దేవుజ నాయక్, రవీందర్ నాయక్ పాల్గొన్నారు.