PRLI | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభంతో జల స్వప్నం సాకారం కానున్నదని, శనివారం సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేయనున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ వేడుకను అందరూ పండుగ వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని నార్లాపూర్ వద్ద ఎత్తిపోతల పనులను పరిశీలించారు. అనంతరం బహిరంగ సభ వద్ద ఏర్పాట్లను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, కలెక్టర్ ఉదయ్కుమార్తో కలిసి మంత్రి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేతుల మీదుగా నీటిని విడుదల చేయనుండడంతో అద్భుత దృశ్యం సాక్షాత్కారం కానున్నదన్నారు. సాగునీటి రాకతో ఇక్కడి ప్రజల బతుకులు బాగు పడుతాయని చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద మోటర్లను వినియోగించి నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావడంతో ఊహించని అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. లక్షలాదిగా జనాలు, నాయకులు తరలిరావాలని మంత్రి పిలుపునిచ్చారు. దుబాయి, ముంబయి, పుణె, ఇతర నగరాల నుంచి కొందరు ఈ వేడుకను తిలకించేందుకు వస్తున్నారని వివరించారు.